అన్నవరం సత్యనారాయణ స్వామి స్థల పురాణం ఏంటంటే..

అన్నవరం సత్యనారాయణ స్వామి స్థల పురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించాడట. తాను రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని స్వామివారు చెప్పారట. తనకు మెలకువ వచ్చిన వెంటనే రాజుగారు గ్రామపెద్దలకు వివరించారట. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికగా.. స్వామివారు చెప్పినట్టుగానే అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి.

వెంటనే గ్రామస్తులంతా కలిసి తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి స్వామి, అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించి.. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు. తరువాతి కాలంలో ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఎన్నో ఆలయాలున్నాయి. రత్నగిరి కొండ దిగువున ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ దర్శనం ఉచితం. ఇక అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి భక్తులు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత రుచికరమైన దేవుళ్ల ప్రసాదాలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

Share this post with your friends