తీర్థం అంటే అభిషేక జలం అనే అర్థమే వాడుకలో స్థిరపడింది. దేవతా మూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు. విగ్రహం, సాలగ్రామం, బీజాక్షరాలు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలకు ఆయా దేవతల స్థాయి, ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరినీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వట్టివేళ్లు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు. ఆ మిశ్రమ ద్రవాన్ని శంఖంలో పోసి దాని చివర నుంచి ధారగా అభిషేకం చేస్తారు.
సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ, అమ్మవార్లకు శ్రీసూక్త విధానంలో, శివలింగానికి రుద్ర నమకచమకాలతోను, చక్రాలు యంత్రాలు తదితరాలకు వేదమంత్రాలు, బీజాక్షరాల స్మరణ పూర్వకంగా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది. వీటన్నింటి సమాహారమైన ఆ అభిషేక జలం శక్తిమంతమైనది. ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేదమంత్రాలు పఠనంతో శుద్ధి పుణ్యాహవచనం అనే ప్రక్రియ జరుపుతారు. తీర్థాల్లో నాలుగు రకాలున్నాయి. అవి జల, కషాయ, పంచామృత, పానక తీర్థాలు. పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జలతీర్థం అంటారు.