
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి లెక్కకు మించిన ప్రసాదాల కారణంగా అంతా తికమకపడుతూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే.. సామాన్యులకే కాదు.. నాడు ఈ తికమక వికటకవి తెనాలి రామలింగడికీ, నందకఖడ్గ అంశతో కారణజన్ముడిగా జన్మించిన అన్నమయ్యకు కూడా తప్పలేదట. ఆ సాహితీ, సంగీత సార్వభౌముల ముందు సామాన్యులమైన మనమెంత? జగన్నాటక సూత్రధారి శ్రీవేంకటేశ్వరుడు ఇన్నిన్ని తినుబండారాలను ఆరగిస్తున్నట్లుగా నటిస్తూ, తెనాలి రామలింగడి లాంటి వికటకవుల వెటకారాలకు గురి అవుతూ తన భక్తుల జిహ్వచాపల్యాన్ని, అన్నార్తిని తీరుస్తున్నాడు.
భక్తులను కాపాడడానికి, ఉద్ధరించటానికి తాను స్వయంగా శారీరక బాధలను, నీలాపనిందలను భరించటం శ్రీమహావిష్ణువుకు అన్ని యుగాల్లోనూ పరిపాటే!గర్భాలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు కూడా మధ్యాహ్న, సాయం సమయాల్లో నాలుగు రకాల అన్నప్రసాదాలు, నాలుగు రకాల పణ్యారాలు, పంచకజ్జాయం నివేదిస్తారు. ప్రత్యేక సందర్భాలలో, అంటే – మూడు రోజుల పవిత్రోత్సవాలు, తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు, మూడు రోజుల జ్యేష్టాభిషేకం – ఉగాది, శ్రీరామనవమి, దీపావళి – ఆస్థాన సందర్భాల్లో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది.
