
గృహణేశ్వర్ ఆలయం గురించి కొన్ని విశేషాలు ఇప్పటికే తెలుసుకున్నాం కదా. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా (ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్)లోని వేరుళ్ గ్రామంలో, ప్రసిద్ధ ఎలోరా గుహల పక్కన ఈ ఆలయం ఉందని చెప్పుకున్నాం. ఈ ఆలయంలో స్పర్శ దర్శనం ఉంది. భక్తులు నేరుగా శివలింగాన్ని స్పర్శించే అవకాశం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి మరొకన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి పురుషులు నేరుగా వెళ్లడానికి కుదరదు. అంటే గర్భగృహంలోకి వెళ్లడానికి ముందు షర్ట్ వేసుకుని ఉంటే దానిని తీసేసి మాత్రమే ఆలయంలోకి అడుగు పెట్టాలి.
పురుషులు పై దుస్తులు ఏవీ కూడా ఒంటిపై ఉంచుకుని శివుడి గర్భాలయంలోకి ప్రవేశించకూడదు. ఇది ఇక్కడి ఆలయ సంప్రదాయం. గృహణేశ్వర్ ఆలయం ఈనాటిది కాదు.. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారు. రాష్ట్రకూటులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరువాత 16వ శతాబ్దంలో మలోజీ భోసలే (శివాజీ మహారాజు తాతగారు) ఆలయాన్ని పునరుద్ధరించారు. 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ మహారాణి దీనిని తిరిగి శోభాయమానంగా నిర్మించారు. గృహణేశ్వర్ దర్శనం వలన సకల పాపాలు నశించి, వంశవృద్ధి, శుభమంగళాలు, శాంతి లభిస్తాయి. అందుకే ఇది ప్రతి శైవభక్తుడు తప్పక సందర్శించవలసిన పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది.
