
హిందువుల్లో కొందరు నిత్యం దేవాలయాలకు వెళ్లేవారుంటారు. కొందరు ప్రత్యేక వారాల్లో.. సందర్బాల్లో వెళ్లేవారుంటారు. అయితే దేవాలయానికి వెళ్ళాక దర్శనం చేసుకుంటే సరిపోదు. ఆలయాలలో పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా మంచిది. ఆ నియమాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. దేవాలయానికి చాలా మంది ప్రశాంతత కోసం వెళుతుంటారు. కాబట్టి దేవాలయానికి వెళ్లేవారు ఇతరుల ప్రశాంతతకు భంగం వాటిల్లే పనులు చేయకూడదు. ఆలయంలో లైబ్రరీలో మాదిరిగా సైలెన్స్ పాటించాలి. సెల్ఫోన్లు వినియోగించడం తోసుకుంటూ వెల్లి దైవదర్శనం చేసుకోవడం వంటివి చేయకూడదు.
దైవదర్శనానికి ముందు కూడా కొన్ని నియమాలున్నాయి. ఏ ఆలయంలో అయినా ప్రవేశించగానే ముందుగా ధ్వజస్థంభానికి నమస్కరించుకోవాలి. గర్భాలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి దర్శించుకోకూడదు. ఒక సైడ్కు నిలబడి దేవుడి దర్శనం చేసుకోవాలి. అలాగే గర్భాలయంలో విగ్రహాలను దర్శించుకునేటప్పుడు కొందరు కళ్లు మూసుకుంటారు. కానీ అలా చేయకూడదు. కళ్ళు తెరచి భగవంతుని స్వరూపాన్ని మనసులో నిలుపుకునేలా దర్శనం చేసుకోవాలి. శివాలయంలో అయితే గర్భాలయంలో శివుడిని దర్శించుకోవడానికి ముందు నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించి ఆ తరువాతనే నేరుగా శివలింగ దర్శనం చేసుకోవాలి.
