మూషికంపై పాశాన్ని ప్రయోగించిన వినాయకుడు.. ఆ తర్వాతేం జరిగిందంటే..

ఇంద్ర సభలో క్రౌంచుడి అనుచిత ప్రవర్తన గురించి తెలుసుకున్నాం కదా. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చి ఎలుకగా మారమని శపించాడు. అయినా సరే ప్రవర్తన మార్చుకోని క్రౌంచుడు ఎలుకగా దేవలోకాలన్నీ తిరుగుతూ అందరికీ విసుగు తెప్పించాడు. దీంతో మరోసారి ఆగ్రహించిన ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి కూడా తరిమెయ్యమని ద్వార పాలకుడిని పురమాయించాడు. ద్వారపాలకులు ఎలుకను భూమిపైకి విసిరేశారు. అలా ఆ ఎలుక పరాశరుని ఆశ్రమానికి చేరింది. అక్కడ కూడా కుదురే లేదు. ఆశ్రమంలో ఎది కనిపిస్తే అది తింటూ అన్నింటినీ ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు. ఒకసారి ఆ ఆశ్రమానికి వినాయకుడు రాగా.. ఆయనకు సంబంధించిన వస్తువులను సైతం పాడు చేశాడు.

ఎలుకను పట్టుకుందామంటే ఎవ్వరికీ దొరకదు. ప్రయత్నించి విసిగిపోయిన ఋషులంతా పరాశరుడుకి మొరపెట్టుకున్నారు. ఆయన వినాయకుడికి తరుణోపాయం సూచించమని కోరాడు. పరాశరుని కోరిక మేరకు వినాయకుడు తక్షణమే రంగంలోకి దిగాడు. తన ఆయుధమైన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా.. అది దాని మెడకు చుట్టుకుని వినాయకుడి పాదాల చెంతకు ఎలుకను తీసుకొచ్చి పడేసింది. అప్పుడు క్రౌంచుడు వినాయకుని కాళ్ళ వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని కోరాడు. వినాయకుడు దయార్ద్ర హృదయంతో క్రౌంచుడిని క్షమించి, మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించడంతో ఆదేశాలను పాటించటానికి ఒప్పుకున్నాడు.

Share this post with your friends