ఇప్పుడేమో కానీ పురాణ కాలంలో సోదరుల పట్ల వల్లమాలిన ప్రేమ ఉండేది. శ్రీ రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపారు. ఇది చూసిన విభీషణుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. అన్నయ్య కనపడితే పాదాలకు నమస్కరిద్దామంటే ఏడి అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు.
సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి. ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ శ్రీరాముడి తోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను… అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’ అని వేదనా భరితుడయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి… బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు.
‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు… అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం.