తిరుమల శ్రీవారి లడ్డూ అంత రుచికరంగా మరేది ఉండదు. అలాంటిది ఇటీవలి కాలంలో కాస్త నాణ్యత తగ్గింది. దీనిపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు దృష్టి సారించారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని పోటు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీబీఎస్వో శ్రీ నరసింహకిషోర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని శ్యామలరావు తెలిపారు. అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈఓకు విన్నవించారు. అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుంచి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈఓకు వివరించారు. అధికారులు, పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత, ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి, ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు.