
విఘ్న రాజాధిపతి అయిన వినాయకుడిని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాం. అసలు మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా దానికి ముందు మనం గణపతి పూజ చేసుకున్న తర్వాతే మొదలు పెడతాం. పూజ అయినా కూడా వినాయకుడి పూజ తర్వాతే ఏ దేవత పూజైనా. అలాంటి గణపతికి మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకం. అలాంటి ఆలయాల్లో ఒకటి పూణేలోని త్రిసూంద్ గణపతి ఆలయం. ఈ ఆలయాన్ని త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి ఆలయంగా కూడా పిలుచుకుంటారు.
ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. గణపతే. వెరీ వెరీ స్పెషల్. ఇక్కడి గణపతిని ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేం. అంత ప్రత్యేకత ఏంటంటారా? ఆయన పేరులోనే ఉంది కదా.. త్రిసూంద్ అని.. అంటే మూడు తొండాలు అని అర్థం. ఈ ఆలయంలో మనం మూడు తొండాలతో ఉన్న వినాయకుడిని దర్శించుకోవచ్చు. పూణేలో సోమ్వర్ పేట్ జిల్లాలోని నజగిరి అనే నదీ తీరంలో ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం ఉంటుంది. ఆలయం పెద్దగా ఏమీ ఉండదు. చాలా చిన్నది. కానీ చాలా అందంగా ఉంటుంది. గర్భగుడిలో కొలువైన వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు.. నెమలి సింహాసనంపై కూర్చొని కనిపిస్తాడు. ఇలాంటి విగ్రహం దాదాపుగా ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి.
