శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామివారు విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ వాహన సేవలలో సమయంలో వాహన బేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్కు రూ.10 లక్షలు విరాళం
శ్రీ ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్కు తిరుపతికి చెందిన ఓ కుటుంబం పది లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. బ్లిస్ హోటల్స్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ ఎం. సూర్యనారాయణ రెడ్డి దంపతులు టిటిడి ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,00,116 విరాళాన్ని గురువారం అందించారు. ఈ మేరకు చెక్ను తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అడిషనల్ ఈవో క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.