శ్రీనివాసుని కల్యాణంలో నివేదన ఎవరికి చేశారంటే..

శ్రీనివాసుడి కల్యాణంలో వంటలెలా చేశారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వడ్డన ఎలా జరిగిందో తెలుసుకుందాం. వంటలన్నీ పూర్తైన తర్వాత వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు. భోజనాల బంతులు వేంకటాచలం నుంచి శ్రీశైలం వరకూ వేశారు. భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన చేస్తారు. “నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు. అది సంప్రదాయం కాదు” అంటాడు వేంకటేశ్వరుడు. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి.

మరి నివేదన చేయని పదార్ధాలను అతిథులెవ్వరూ ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ. ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబిలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండని శ్రీనివాసుడు చెబుతాడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు. తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి.

Share this post with your friends