
ఈ వ్యాసతీర్థులవారు కూడా భగవత్ రామానుజులవారివలెనే శ్రీస్వామివారి మూలవిరాణ్మూర్తిని దివ్యసాల గ్రామమూర్తిగా భావించడమే కాక తిరుమల దివ్యక్షేత్రం కూడా దివ్య సాలగ్రామమమని, అందువల్లే వారు కూడా మోకాళ్లతోనే వేంకటాచల క్షేత్రాన్ని అధిరోహించినట్లు చెబుతారు. ఇంతేకాదు అన్నమాచార్యుల వారి చరిత్రలో కూడ ఇలా పేర్కొన బడింది. మొట్టమొదట పాదరక్షలతో తిరుమల కొండను ఎక్కుతూ అలసి, కళ్లు కనపడక, కాళ్లు ముందుకు సాగక చతికిలబడిన అన్నమయ్యతో సాక్షాత్తు శ్రీవేంకటేశుని పట్టపురాణి అలమేలు మంగ ఇలా అంటుంది.
“ఈ మహాపర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము ఘనులకు నిది చెప్పుఁగాళ్ల నెక్కంగ జనదు, నీ చెప్పులు సడలించి వైచి కనుఁగొను కన్నులఁ గనవచ్చుననిన.” అప్పుడు అన్నమయ్య తన కాళ్లకున్న చెప్పులను విసిరివేసినాడు. “ఆ రమా నారాయణాకృతి గలిగి శ్రీరామ కృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నియు నొక్క మొత్తమైనట్లు వర్తింపుచున్న నా వడువు వీక్షించి మహిత సాలగ్రామమయ మౌనటంచు బహు విస్మయము నొంది ప్రణతులొనర్చి” తరువాత అలమేలు మంగ అనుజ్ఞతో తిరుమల కొండ చేరుకొన్నాడు అన్నమయ్య.
