వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున మనం అక్షయ తృతీయను జరుపుకుంటాం. ఈ ఏడాది ఏప్రిల్ 30న మనం ఈ పండుగను నిర్వహించుకోనున్నాం. ఈ రోజున చాలా మంది శుభకార్యాలు సైతం చేపడతారు. అయితే ఈ రోజున చేపట్టే కార్యక్రమాలకు శుభసమయం చూసుకోనవసరం లేదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున సర్వార్ధ సిద్ది దినంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఏ పని చేపట్టినా ఎలాంటి విఘ్నమూ లేకుండా పూర్తవుతుంది. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని సూర్యుడిని పూజించుకుంటాం. వీరి ఆశీస్సులు పొందితే అన్ని పనులూ నిర్విఘ్నంగా పూర్తవడంతో పాటు ఆర్థికంగానూ బాగుంటుంది.
ఇక సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే ఈ సారి అక్షయతృతీయ నాడు కొన్ని యోగాలు కూడా ఏర్పడనున్నాయి. అవేంటంటే.. సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం. ఈ మూడు యోగాలు కూడా చాలా మంచివే. సర్వార్థ సిద్ధి యోగం ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకు సాయపడితే శోభన యోగం శుభాన్ని.. రవి యోగం పనిలో విజయం, శ్రేయస్సును తెచ్చిపెడుతుంది. ఈ మూడు యోగాల కలయికతో అక్షయ తృతీయ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజున చేసే కొన్ని పరిహారాలతో లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.