శివుడు ఏ ఆలయంలో అయినా లింగరూపంలోనే మనకు దర్శనమిస్తాడు. అభిషేక ప్రియుడైన శివుడిని కొలిచి కోరుకున్న వరాన్ని పొందుతారు. కొందరు ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్టించుకుంటారు. ఇలా ప్రతిష్టించుకుంటే నిత్య పూజ చేయాల్సి ఉంటుంది. ప్రతిష్టించే విధానంలో సైతం వాస్తు నియమాలను పాటించాల్సిందే.
ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం శుభప్రదమే కానీ అది పరిమాణంలో చిన్నదిగా ఉండాలి. బొటనవేలు పరిమాణం కంటే పెద్దగా ఉండకూడదు. నర్మదా నదిలో లభించే రాతితో చేసిన శివలింగం అయితే ఇంకా మంచిది. ఈ శివలింగం అత్యంత పవిత్రమైనదని చెబుతారు.
ఇంట్లో లోహంతో చేసిన శివలింగాన్ని కొందరు ప్రతిష్టించుకుంటారు. అలా అనుకునేవారు బంగారం, వెండి లేదంటే రాగితో తయారు చేయించుకుని.. శివలింగం చుట్టూ పాము ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ప్రతిష్టించుకోకూడదు. శివలింగానికి పూజ చేసే సమయంలో భక్తుడి ముఖం తూర్పు వైపు తిరిగి ఉండాలి. పూజగదిలో శివలింగాన్ని పడమర వైపు ఉండే విధంగా అమర్చుకోవాలి. ఇక శివలింగం పానవట్టం వచ్చేసి ఉత్తరదిశలోనూ.. నీటి ప్రవాహాన్ని తూర్పు వూపు ఉంచాలి. విరిగిన శివలింగాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. అలాగే శివలింగాన్ని నేలపై పెట్టకూడదు.