
సిరిమాను జాతర ఈ మంగళవారం జరగనుంది. పైడితల్లి అమ్మవారిని గజపతి రాజులు తమ ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి సిరిమానోత్సవం గజపతి రాజుల వారసుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి అమ్మవారి ప్రతి రూపంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక పైడితల్లి ఉత్సవం నిర్వహించడం వెనుక కథేంటంటే.. 18వ శతాబ్దంలో పైడితల్లి అమ్మవారి నిర్మాణం జరిగినట్టుగా పేర్కొంటారు. పైడిమాంబ జాతర తొలిరోజున తొల్లెళ్ల ఉత్సవం, రెండవ రోజున సిరిమానోత్సవం నిర్వహిస్తారు.
అప్పట్లో విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య యుద్ధం జరిగిందట. ఆ యుద్దంలో బొబ్బిలి కోట పూర్తిగా ధ్వంసమవడంతో పాటు బొబ్బిలి సైనికులు సైతం పెద్ద ఎత్తున యుద్ధంలో మరణించారు. అయితే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో రామరాజు భార్య అతని సోదరి పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతున్నారు. మరోవైపు యుద్ధంలో విజయ రామరాజును తాండ్ర పాపా రాయుడు సంహరించాడు. ఈ విషయం పైడిమాంబ పూజ నిర్వహించుకుంటున్న సమయంలో ఆమెకు తెలిసింది. విషయం తెలుసుకుని పైడిమాంబ ఆవేదనతో తనువు చాలిస్తుంది. ఆ తురవాత రాజ్యంలోని పతివాడ అప్పల నాయుడనే సైనికుడికి కలలో కనిపించి ఓ సరస్సులో పడమర వైపు వెతికితే తన విగ్రహం దొరుకుతుందని ఆ విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. పైడితల్లి చెప్పిన ప్రకారమే ఆ సరస్సు పక్కన ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
