
ముస్లింలు పూజారులుగా ఉన్న హనుమంతుడి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప అనే గ్రామంలో ఉంది. ఇక్కడి హనుమంతుడి ఆలయానికి గత 150 ఏళ్లుగా ముస్లింలే పూజారులుగా ఉన్నారు. నిత్య పూజలు, ఆరాధనలన్నీ వీరే నిర్వహిస్తారు. అసలు ఈ ఆలయానికి సంబంధించిన కథేంటో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ గ్రామంలోకలరా వ్యాపించిందట. కలరా కారణంగా క్రమక్రమంగా గ్రామంలోని వారంతా మృత్యువాత పడుతున్నారట. మరికొందరు భయంతో గ్రామం వదిలి వెళ్లనారంభించారట.
క్రమక్రమంగా గ్రామమంతా దాదాపుగా ఖాళీ అయిపోయిందట. అయితే కొన్ని ముస్లిం కుటుంబాలు మాత్రం గ్రామాన్ని వదల్లేక అక్కడే ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజలు చేయడం ఆరంభించారట. అంతే వ్యాధి అంతమైపోయింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి ఏ భక్తుడు వచ్చి మొక్కినా కూడా తప్పక కష్టం నుంచి గట్టెక్కుతారట. అప్పటి నుంచి ముస్లింలు ఈ ఆలయంలో పూజలు చేయడం ఆరంభమై క్రమక్రమంగా అదే ఆనవాయితీగా మారిపోయింది. మతం కంటే విశ్వాసం గొప్పదని ఇక్కడి ముస్లింలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన మంగళ, శని వారాల్లో గ్రామస్తులంతా ఒక్కటై ఆంజనేయుడి పూజలో పాల్గొంటారు.
