ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వేదనారాయణ స్వామి కొలువై ఉన్నాడని తెలుసుకున్నాం కదా. ఇక్కడ సాక్షాత్తు గోవిందుడే మత్సావతారంలో అవతరించాడు. అయితే ఈ ఆలయ స్థల పురాణం గురించి ముందుగా తెలుసుకుందాం. మనిషి తన జీవితాంతం ఎలా జీవించాలో చెప్పేదే వేదం. అలాంటి వేదాలను రక్షించేందుకు దశావతారాల్లో మొదట మత్స్యావతారాన్ని విష్ణుమూర్తి ఎత్తాడు. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని దగ్గర ఉన్న వేదాలను అపహరించిన కథ గురించి మనకు తెలిసిందే. వేదాలను అపహరించిన మీదట సోమకాసురుడు సముద్రంలో సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు.
అప్పుడు బ్రహ్మ వచ్చి విష్ణుమూర్తిని వేడుకోవడంతో సోమకాసురిడితో భీకర యుద్ధం చేశాడు. యుద్దంలో సోమకాసురుడిని సంహరించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పగించాడు. అయితే వేదాల కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన విష్ణుమూర్తి ఎంతకూ తిరిగి రాకపోవడంతో అమ్మవారు భూలోకానికి వచ్చిందట. అప్పుడు విష్ణుమూర్తి శిలారూపాన్ని ధరించి ఉండటంతో ఆయనకు అభిముఖంగా అమ్మవారు సైతం శిలారూపంలో నిలిచిపోయిందని ఆలయ స్థల పురాణం చెబుతోంది. నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగానూ.. వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తారు. నారాయణుడు వేదాలను తిరిగి తెచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా పేరు గాంచింది.