జూన్ 30 నుంచి కైలాస్ యాత్ర ప్రారంభం కానుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని బృందాలుగా కైలాస్ యాత్ర చేయాలనుకునే భక్తులను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బృందంలో 50 మంది చొప్పున ఉంటారు. ఐదు గ్రూపులుగా విభజించి మొత్తంగా 250 మంది భక్తులను కైలాస మానస సరోవర యాత్రకు తీసుకెళతారు. ఇక ఈ యాత్రలో మొదటి బృందం వచ్చే జూలై 10న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది.
కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు చివరి బృందం ఆగస్టు 22న చైనా నుంచి భారతదేశానికి బయలుదేరుతుంది. ప్రతి బృందం ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. అనంతరం ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లా తనకాపురలో ఒక రాత్రి, పిథోరగఢ్ జిల్లా ధార్చులాలో ఒక రాత్రి, గుంజిలో రెండు రాత్రులు, నభిడాంగ్లో రెండు రాత్రులు బస చేసిన మీదట చైనాలోకి ప్రవేశిస్తుంది. తిరుగు ప్రయాణంలో పిథోర్గఢ్ జిల్లా బుండిలో ఒక రాత్రి, చౌకోరిలో ఒక రాత్రి, అల్మోరాలో ఒక రాత్రి బస చేసి ఢిల్లీకి చేరుకుంటారు. ఇలా ప్రతి బృందం మొత్తం 22 రోజుల పాటు ప్రయాణించాల్సి వస్తుంది. ఇక యాత్ర చేసే భక్తులకు తొలుత ఢిల్లీలో.. ఆపై గుంజిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రయాణికులను, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆహారం అందిస్తారు.