రథసప్తమి పర్వదినం సందర్భంగా ఒకవైపున పెద్ద ఎత్తున స్వామివారి వాహన సేవలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కట్టిపడేశాయి. తెల్లవారుజామునే భక్తులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. వాహన సేవల మధ్యలో స్వామివారి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ సేవలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది.
సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు.
భక్తులను అలరించిన కళా ప్రదర్శనలు
సూర్యప్రభ వాహనసేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. సూర్యదేవుని వేశషధారణలు, దశావతారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.