శ్రీవారి భక్తులకు మరోమారు టీటీడీ కీలక విజ్ఞప్తి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్ట పోవద్దని టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తోంది. తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కల్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి, విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్‌పోర్ట్‌లోని చివరి నంబర్లు మార్చి ఆన్ లైన్‌లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు.

విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుత టీటీడీ యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉందన్నారు. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని టీటీడీ తెలియజేసింది. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి టీటీడీ హెచ్చరిస్తోంది.

Share this post with your friends