ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవేరులతో కలిసి స్వామివారు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహన సేవను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎనిమిదవ రోజున స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు మాఢ వీధుల్లో ఊరేగి కనువిందు చేశాడు. భక్తులంతా స్వామివారి రథాన్ని లాగి సంతోషంగా గడిపారు.

ఇక నిన్న స్వామివారి చక్ర స్నానం పెద్ద ఎత్తున జరిగింది. ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల స్వామి పుష్క‌రిణిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వహించారు. ఇక శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి,టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends