తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
శ్రీవారి ప్రణయకలహోత్సవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 15వ తేదీన జరుగనుంది. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరుమలలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 15న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.