వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10 , 11వ శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం – బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి , ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా , నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా , వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.
ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి , దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి , శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి , శుక్రవారం ఉత్తర నక్షత్రం , కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల , మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి , సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.