రథసప్తమి సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోనూ పెద్ద ఎత్తున వేడకలు జరిగాయి. స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ సేవలు నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.