తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
నవంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.
నవంబరు 15న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
నవంబరు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.