ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆలయ పరిసర ప్రాంతానికి వెళ్లగానే ముందుగా మనకు ధ్వజస్తంభమే దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని సైతం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అసలెందుకు ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభం ఉంటుంది? దాని ప్రత్యేకత ఏమిటి? ధ్వజము అంటే జెండా అని అర్థం. జెండాను ఉంచేటువటి స్థంభమే ధ్వజస్తంభం. గుడిలోకి అడుగుపెట్టే ముందే ముందుగా మనకు ధ్వజస్తంభమే కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని మనిషి శరీరంలోని వెన్నముకతో పోలుస్తారు.

మనిషికి వెన్నెముక ఎంత అవసరమో ఆలయానికి ధ్వజస్తంభం అంతే అవసరమని చెబుతారు. గుడిలోకి అడుగు పెట్టిన వారికి జీవితంలో స్థిరత్వాన్ని ధ్వజస్తంభం అనుగ్రహిస్తుందట. అంతేకాకుండా గుడిలోని మూలవిరాట్టు తేజస్సులోని కొంతశాతం ధ్వజస్తంభం పైకి ప్రసరిస్తుందని చెబుతారు. అలా ధ్వజస్తంభానికి కూడా దైవిక శక్తి ఉంటుందట. అందుకే ఆలయంలోకి వెళ్లిన వెంటనే ధ్వజస్తంభానికి ముందుగా నమస్కరించుకుంటాం. అలాగే ధ్వజస్తంభానికి, గర్భాలయంలోని స్వామివారికి మధ్యలో మనం ఎప్పుడూ కూడా నిలబడకూడదని పండితులు చెబుతారు. స్వామివారి కీర్తిని ధ్వజస్తంభానికి ఉన్న జెండా నలుదిశలా చాటుతూ ఉంటుంది.
