తిరుచానూరు శ్రీ సుందర రాజ స్వామివారు శనివారం రాత్రి గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు నిన్నటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మూడవ రోజున స్వామివారి అవతార మహోత్సవాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, ఏవిఎస్ఓ శ్రీ సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.