రామాయణం వింటే అర్థం కాకున్నా జరిగేదేంటంటే..

ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. “రామాయణం నీకేం అర్ధమైంది” అని అడిగింది భార్య. “నాకేం అర్ధం కాలేదు” అన్నాడు బండోడు. ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుంచి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. “ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దానితో నీళ్ళు పట్రా” అంది. బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది.

రామాయణం వింటే అర్థం కాకున్నా జరిగేదేంటంటే..
రామాయణం వింటే అర్థం కాకున్నా జరిగేదేంటంటే..

“చూసావా! ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు. అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. నువ్వా గుండ్రాయితో సమానం” అని ఈసడించింది.

అప్పుడు బండోడు అన్నాడు, “గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ, పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల నుంచి వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది” అన్నాడు. భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది! నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి. విన్నా చాలు!

Share this post with your friends