17న‌ సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు

సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంట‌ల‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఉద‌యం 11 గంటల‌కు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Share this post with your friends