థామస్ లేరు.. ఏమీ లేరు.. అసత్య ప్రచారాలను నమ్మకండి: టీటీడీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం పట్ల భక్తులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. తిరుమల లడ్డూ ఉన్నంత రుచి అలాంటిది. ఇక శ్రీవారి లడ్డూ విషయమై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వెల్లడించింది. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Share this post with your friends