ఈ హనుమంతుడి ఆలయంలో ముస్లింలే పూజారులు

మన దేశంలో ఎన్నో కులాలు, మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. పలు సందర్భాల్లో మత సామరస్యాన్ని గురించి తెలిపే ఘటనల గురించి కూడా మనం వింటూనే ఉన్నాం… చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త ఈ కోవకు చెందినదే. ఓ ఆలయంలో హిందువులు కాదు.. ముస్లింలు పూజాధి కార్యక్రమాలను అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లింలు నిత్యం హనుమంతుడిని ఆరాధిస్తూ పూజిస్తారు. ఇది ఈనాటి సంప్రదాయం కాదు.. దాదాపు 150 సంవత్సరాలుగా.. ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.

ఇంతకీ ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పూజించే హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలయం కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కొలువైన ఆంజనేయుడిని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంగా పేర్కొంటారు. ఈ ఆలయంలో హనుమంతుడిని హిందూ, ముస్లింలు కలిసి పూజిస్తారు. ఇక్కడ హనుమంతుడు తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని ప్రజల నమ్మకం. అయితే ఇక్కడ పూజ నిర్వహించేది మాత్రం ముస్లింలు మాత్రమే కావడం విశేషం. ఇక్కడి హనుమంతుడిని సంకటమోచనుడిగా భావించి ప్రజలు పూజలు నిర్వహిస్తారు.

Share this post with your friends