ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథ సప్తమి రోజున 2 – 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్ల గురించి ఛైర్మన్ వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
వాహన సేవల వివరాలు
ఉదయం 5.30 – 8 గంటల వరకు (సూర్యోదయం 6.44 ) – సూర్య ప్రభ వాహనం
ఉదయం 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ
• 1250 మంది పోలీసులు, 1,000 విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు.
• ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు.
• గ్యాలరీలలోకి వచ్చే భక్తుల కొరకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు అత్యవసర మార్గాలు (ఎమర్జెన్సీ గేట్లు) ఏర్పాటు.
• టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు.
• భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల ఏర్పాటు.
సీనియర్ అధికారులతో పర్యవేక్షణ
మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ.
అన్నప్రసాదాలు
ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీ.
తాత్కాలిక షెడ్లు
భక్తులు చలికి, ఎండకు ఇబ్బంది లేకుండా మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు.
లడ్డూల నిల్వ
భక్తులకు అవసరమైన 8 లక్షల లడ్డూల తయారీ. (ఇందులో అందుబాటులో 04 లక్షల లడ్డూలు, అదనంగా మరో 04 లక్షల లడ్డూల బఫర్ స్టాక్)
విద్యుత్ అలంకరణలు
తిరుమలలో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు.
భక్తులు శ్రీవారి వాహన సేవలను తిలకించేలా భారీ ఎల్.ఈ.డీ స్ర్కీన్ లు ఏర్పాటు.
పుష్పాలంకరణలు
తిరుమాడ వీధులను వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలు, పందిళ్లు, అరటి చెట్లతో అందంగా అలంకరణ.
పబ్లిక్ అడ్రెస్ సిస్టం
భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా తాజా సమాచారం అందేలా చర్యలు.
ఎస్వీబీసీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు రథసప్తమి వేడుకను తిలకించేందుకు వీలుగా హెచ్ డీ క్వాలిటీతో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం.
సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీవారి వాహనసేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు.
శ్రీవారి సేవకులు
గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందించడానికి వీలుగా దాదాపు 2500 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగం.
పారిశుద్ధ్య సేవలు
భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు.
వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి.
వైద్య సేవలు
భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలు ఏర్పాటు.