రాముడు అనుసరించి మార్గదర్శకంగా మారడమే రామాయణం. సాక్షాత్ శ్రీమన్నారాయణుని స్వరూపమే శ్రీరాముడిగా పేర్కొంటారు. రాక్షస సంహారం కోసం రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే రాముడు పుట్టాడని మనకు పురాణాల వల్ల తెలుస్తోంది. శ్రీమహావిష్ణువు దశావతారాల గురించి మనకు తెలిసిందే. ఈ దశావతారాల్లో ఏడో అవతారమే శ్రీరామావతారం. అయితే ఈ అవతారంలో విష్ణుమూర్తి సాధారణ మానవుడు మాదిరిగానే కష్ట సుఖాలను అనుభవించాడు తప్ప తన మహత్యాన్ని చూపింది లేదు. సకల గుణాభిరాముడు శ్రీరాముడు.
శ్రీరాముడు ధర్మనిరతిని హిందువులు ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటారు. ఒక మనిషి తండ్రిగా, తనయుడిగా, భర్తగా, ప్రభువుగా, శిష్యుడిగా సోదరుడిగా ఆ మాటకొస్తే ఏ పాత్రలోనైనా ఎలా నడుచుకోవాలి? మాటపై ఎలా నిబడాలి? కష్టాలను, అవరోధాలను ఎలా జయించాలో శ్రీరాముడు లోకానికి చాటి చెప్పాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముని ‘పూర్వభాషి ప్రియంవదః’ అని వర్ణించాడు. అంటే రాముడు ముందుగానూ.. ప్రియంగానూ మాట్లాడుతాడని అర్థం. శ్రీరామనవమిని ఏడాదికోమారు జరుపుకోవడమే కాకుండా శ్రీరాముని సద్గుణాలను అలవరుచుకుని, ఆయన బాటలో నడవాలి.