జరాసంధునితో 17 సార్లు యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు..

శ్రీకృష్ణుడు 16 ఏళ్ల వరకూ పడిన కష్టాల గురించి తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి ఆత్మహత్య ఆలోచన చేసే వారికి కన్నయ్య జీవితం ఒక పాఠం. పుట్టడమే చెరసాలలో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆ తరువాత ఎందరో రాక్షసులతో యుద్ధం.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. జరాసంధునితో ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కానీ క్షణం కాలమైనా విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే “కాలయవనుడు” అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది.

యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుంచి ద్వారకకు మకాం మార్చాడు. రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. అలా జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి.

Share this post with your friends