వైకుంఠ ఏకాదశికి వైష్ణవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 10వ తేది వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున తిరుప్పావై సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన, శ్రావణ తిరుమంజనం, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6.30 గం.ల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఏ.పి.శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ కె.ముని కృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.