
స్కంద షష్టి ఎప్పుడనేది తెలుసుకున్నాం. ఈ రోజున మనం కార్తికేయుడిని పూజించుకుంటూ ఉంటాం. ఇక స్కంద షష్ఠి ప్రాముఖ్యత ఏంటంటే.. ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఈ రోజున పూజిస్తే జీవితంలో ప్రశాంతత, శ్రేయస్సు పొందుతారట. ఇక స్త్రీలు ఈ రోజున సంతాన ప్రాప్తితో పాటు పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసముంటారు. ఈ రోజున కార్తికేయుడిని పూజించుకుని ఉపవాసముంటే శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుందట. స్కందషష్టి పూజా విధానమేంటో తెలుసుకుందాం.
స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గదిని శుభ్రం చేసిన అనంతరం కార్తికేయ విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. స్వామివారి ముందు దీపం వెలిగించి ధూపం వేయాలి. అనంతరం కార్తికేయుడికి పూలతో పాటు నైవేద్యం సమర్పించాలి. పూజానంతరం కార్తికేయుని జన్మ రహస్యం కథను వినడం కానీ చదవడం కానీ చేయాలి. ఇక ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రాత్రి జాగారం చేస్తే మంచిది. సంతానం కోసం స్కంద షష్టి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్యాలు పొందుతారని నమ్మకం.
