భారతదేశంలో ఆలయాలకు కొదువ లేదు. ఇక వీటిలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. హిందూ మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు నేటికీ వాటిలో మనకు కనిపిస్తాయి. అలాంటి ఆలయాల్లో కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఈ ఆలయం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 402 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని సూర్యవర్మన్ (క్రీ.శ. 1112-53 కాలంలో) అనే చక్రవర్తి నిర్మించారు. అప్పట్లో దీనిని ‘యశోధర పూర్’ అని పిలిచేవారు.
సూర్యవర్మన్ ఈ ఆలయాన్ని ఖైమర్ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ప్రారంభించనైతే ప్రారంభించాడు కానీ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు. దీనిని సూర్యవర్మన్ మేనల్లుడు, వారసుడు ధరణీంద్ర వర్మన్ తమ పాలనలో పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం ఈజిప్టు, మెక్సికో పిరమిడ్ల మాదిరిగా ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన గోపురం దాదాపు 64 మీటర్ల ఎత్తులో ఉండగా.. మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు 54 మీటర్లు.. ఆలయం చుట్టూ మూడున్నర కిలోమీటర్ల పొడవైన రాతి గోడ, 30 మీటర్ల వెడల్పుతో బహిరంగ ప్రదేశం, 190 మీటర్ల వెడల్పుతో కందకం ఉన్నాయి. ఇది చోళుల రాజవంశం నిర్మాణాలను పోలి ఉంటుంది.