నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపును తాజాగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీని లెక్కించడం జరిగింది. చంద్రవతి కళ్యాణ మండపంలో ఈ లెక్కింపును నిర్వహించారు. పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.5,96,92,376 కోట్లతో నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. 26 రోజుల్లో ఈ ఆదాయాన్ని లెక్కించినట్టుగా ఆలయ ఈవో తెలిపారు. శ్రీ మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారు.
ఈ హుండీ లెక్కింపులో రూ.5,96,92,376 కోట్ల నగదుతో పాటు 232 గ్రాముల 400 మిల్లి గ్రాముల బంగారం, వెండి 7 కేజీల 850 గ్రాములు లభించింది. ఇక ఇతర దేశాల కరెన్సీ కూడా లభించింది. యుఎస్ఏ డాలర్లు 558, సౌదీఅరేబియా రియాల్స్ 3, ఓమన్ బైసా – 200, కువైట్ దినార్ 12, కత్తారు రియాల్స్ 4, సింగపూర్ డాలర్లు 7, ఆస్ట్రేలియా డాలర్లు 60, కెనడా డాలర్లు – 35, హాంకాంగ్ డాలర్లు 10, యూకే ఫౌండ్స్ 5, ఈరోస్ 115, కెన్యా షిల్లింగ్స్ 50, ఫిలిపిన్స్ పిసో 20, యూఏఈ దిర్హమ్స్ 15, జాంబియా క్వచ 20, జపాన్యన్స్ 1000 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించినట్టు ఆలయ ఈవో వెల్లడించారు.