పిల్లలపై తల్లిదండ్రులకున్న ప్రేమను కన్నయ్య ఎలా చెప్పాడంటే..

పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీని గురించి వివరించే శ్రీకృష్ణుడి కథ ఒకటి ఉంది. శ్రీ కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయ వేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బతకలేం’అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకునేవాడు.

ఈ క్రమంలోనే ఒకరోజు కన్నయ్య.. ఉద్ధవునితో, “ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను” అని మొండి పట్టు పట్టి కూర్చొన్నాడు. ‘నా తల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను” అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు. కంసుని చెరసాల నుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు. “మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్నమేనికెవ్వార లాఢ్యులు మీరు కారె యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు” అంటే “అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు!” బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.

Share this post with your friends