28 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా అక్టోబరు 27వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబ‌రు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల‌కు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Share this post with your friends