శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేష పూజ

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు. గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు తొలిసారిగా వార్షిక విశేషపూజను వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends