సూర్యుడి సప్త కిరణాలేంటో తెలుసా?

సూర్యుడికి దేశవివక్ష కానీ, జాతి భేదం కానీ లేదు. ఆయనకు కొంచెం కూడా అలసట రాదు.. ఒక్కక్షణం ఆగేది లేదు. విరామం, విశ్రాంతి లేకుండా కాంతి కాగడాతో నిరంతరం పయనిస్తాడు. ఊపిరినీ ఉత్తేజాన్నీ చేతననీ చిన్మయాన్నీ లోకమంతా పంచుతాడు. విశ్వామిత్రాది మహర్షులంతా సూర్యుని ఆరాధించారు. ఏ సాంకేతికతా లేకుండానే కోట్ల మైళ్ల దూరానున్న సూర్యుని ప్రస్థానాన్ని గమనించారు. ఆదిత్యుని హృదయ సందేశాలు తెలియజేశారు. మనకు ముక్కోటి దేవతలున్నా సూర్యచంద్రులే కళ్లకు కనిపించే దైవాలు. తెల్లవారుతూనే తేజోవంతంగా ప్రత్యక్షమయ్యే సూర్యుడు మాఘ శుద్ధ సప్తమినాడు జన్మించాడు.

అదే రథసప్తమి. ఆ విశిష్టదినాన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానం చేస్తే ఏడురకాల వ్యాధులు నశిస్తాయట. కొండను అద్దంలో చూపిన చందంగా అఖండుడు, అనంతుడు అయిన సూర్యుడి గురించి విశేషాలేంటో తెలుసుకుందాం. సూర్యుడు సహస్ర కిరణుడు. ఇందులో ముఖ్యమైన కిరణాలు ఏడు. అవి సుషుమ్న, హరికేశం, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వం, స్వరాడ్వసు. సప్తరశ్ములంటే ఇవే. ఇలా ఏడు రశ్ములున్న సూర్యుని సప్తమినాడు పూజించడం ఆనవాయితీ. ఇక రథసప్తమి నాడు సూర్యుడు వరుణుడి రూపంలో సాయంసంధ్యాదేవితో కూడి ఉంటాడు. ఈమె సప్త ఛందస్సులకు తల్లి.

Share this post with your friends