జపం అనేది మంత్రాన్ని లేదా దైవనామాన్ని పదే పదే ధ్యానించడం. నిరంతరం ఎంత ఎక్కువగా భగవన్నామాన్ని జపిస్తూ ఉంటామో భగవంతునికి అంత దగ్గరగా జరుగుతూ ఉంటాము. దీనివల్ల, సర్వసమర్పణబుద్ధి, శరణాగతి అలవడుతుంది. శరణాగతి చేసిన భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు. పిల్లి తన పిల్లల బాధ్యత రక్షణ తానే వహించినట్లు. ఇక కోతి పిల్ల, తల్లి ఎక్కడ ఏపరిస్థితిలో ఉన్నా తాను స్వయంగా తల్లిని గట్టిగా పట్టుకొని ఉండాలి. తల్లికి అందులో బాధ్యత ఉండదు. దీనినే శాస్త్రంలో మార్జాల కిశోర న్యాయం—మర్కట కిశోర న్యాయంగా పేర్కొంటారు.
ఇది ఒక శక్తివంతమైన సాధనంగా పని చేసి, మనలను పాపాల నుంచి రక్షించి, మనసును నిర్మలంగా చేసి, మన శరీరానికి, మనసుకు, ఆత్మకు శ్రేయస్సును అందిస్తుంది జపం మన దుఃఖాలను, కష్టాలను తొలగించి, సుఖాన్ని కలిగించడమే కాకుండా భగవంతునితో అనుసంధానిస్తుంది. ప్రారంభంలో యాంత్రికంగా అనిపించినా పోను పోను ఈ జపం మనలను భగవంతునికి అత్యంత ఇష్టునిగా చేస్తుంది.ఇది ఎవరికి వారు నిత్యమూ సాధన చేస్తూ ఉంటే వారికి బుద్ధిపూర్వకముగా అనుభవములోకి వస్తుంది. కాబట్టి రోజుకు కాసేపైనా జపంలో కూర్చొంటే చాలా మంచిది.