బ్రహ్మదేవుడి గురించి ఈ కథ తెలుసా?

దేవుడు, మనిషి, దానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు. దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమని ప్రార్థించాడు. మాట కాదు.ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టమటూ ‘ద’ అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు.దేవుడికి పరమానందమయింది. “ద’ అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం)లేదనేగా నీ ఫిర్యాదు! అది అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!” అని వెళ్ళిపోయాడు దేవుడు.

అనంతరం మనిషి బ్రహ్మదేవుణ్ణి సమీపించి దేవుడి మాదిరిగానే తనకు కూడా జీవితానికి పనికొచ్చే మంచి ముక్క ఏదైనా చెప్పమని అర్థించాడు. “దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!” అని యథాప్రకారం సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహా సంతోషమైంది. “ద’ అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటాను” అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. ఈ సారి దానవుడి వంతు వచ్చింది. “దానవా! నీ అన్నల్లాగా నువ్వూ ‘ద’ శబ్దం భావం బాగా గ్రహించి ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!” అని బోధించాడు బ్రహ్మదేవుడు.

“’ద’ శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తాను” అని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు.
వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో ‘ద.. ద.. ద’ అంటూ కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమ, దాన, దయా గుణాలని గూర్చి బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములట.

Share this post with your friends