పూర్వం ముద్గలుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పొలంలో మిగిలిన వడ్ల గింజలను ఏరుకుంటూ, ఎవరన్నా దాతలు ధాన్యాన్ని దానం చేస్తే స్వీకరిస్తూ అతను కాలం గడిపేవాడు.ముద్గలుడు పేదవాడే కావచ్చు. కానీ సత్యాన్నే నమ్ముకున్న నీతిపరుడు. లేనివాడే కావచ్చు, కానీ తనకి ఉన్నదాన్ని అతిథులతో పంచుకునే ఉదారహృదయుడు. పైగా ముద్గలుడు పక్షపవాసం అనే వ్రతాన్ని చేసేవాడు. అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మాత్రమే ఆహారాన్ని భుజించేవాడు. ముద్గలుని సత్యనిష్ట నానాటికీ ముల్లోకాలలోనూ వ్యాపించసాగింది.
సాక్షాత్తు దుర్వాసమహర్షే, ముద్గలుని సంకల్పం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఒక యాచకుని వేషంలో ముద్గలుని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షని విరమించి భోజనం చేసే సమయం.. ముద్గలుడు ఆహారాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో.. ఇంటి ముందర యాచకుడు కనిపించాడు. ఒంటి మీద సరిగా గుడ్డయినా లేకుండా, జడలు కట్టేసి, క్రోధమే ఆయుధంగా ఉన్న ఆ యాచకుని చూసి ముద్గలుడు సాదరంగా ఆహ్వానించాడు. తన ఇంట్లో ఉన్న ఆహారాన్ని అతని ముందు ఉంచాడు. దుర్వాసుడు ఆ ఆహారాన్ని తిన్నంత తిన్నాడు, మిగిలిందంతా ఒంటికి పూసుకున్నాడు. ఆపై తన దారిన తాను చక్కా పోయాడు.
ముద్గలుడు ఆ పదిహేనవ రోజున కూడా నిరాహారంగా మిగిలిపోయాడు. ముద్గలుడు ప్రతి పక్షానికీ తన ఉపవాసాన్ని విరమించేందుకు సిద్ధపడటం. అదే సమయంలో ఆ ఉన్మత్తుడు వచ్చి తిన్నంత తిని, మిగతాది నేలపాలు చేసి పోవడం! ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు…. ఆరు సార్లు జరిగింది.చివరికి దుర్వాసుడు, ముద్గలునికి తన నిజరూపంలో దర్శనిమిచ్చాడు. ‘ముద్గలా నీ ఆతిథ్యం, ఉపవాసవ్రతం అసాధారణమైనవి. నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైనది కాబట్టే నువ్వు ఇన్నాళ్లుగా ఆకలిని కూడా తట్టుకుని జీవించగలిగావు. నీ దీక్షకు మెచ్చాను. నీకు స్వర్గలోకప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను’ అంటూ వరాన్ని అందించి వెళ్లిపోయాడు.