
హిందూ సంప్రదాయంలో పూజలో ఉపయోగించే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. మనం నిత్యం పూజ తర్వాత, సాయంత్రం సంధ్యా సమయంలో శంఖనాదం చేస్తుండటం ఆనవాయితీ. అలా చేయడం అంతా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అలా శంఖనాదం చేయడం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన వాటిలో శంఖం కూడా ఒకటి. ఈ సమయంలో ఉద్భవించిన శంఖానికి పాంచజన్యం అని పిలుస్తారు. అంతేకాదు.. దీనిని శ్రీమహావిష్ణువు స్వీకరించడంతో దానికి అంతటి ప్రాధాన్యత.
మరో విశేషం ఏంటంటే.. శంఖం శ్రీమహాలక్ష్మి తోబుట్టువు అని కూడా చెబుతారు. అందుకే పూజా గదిలో భగవంతుడి చిత్రపటాలతో పాటు శంఖానికి కూడా ప్రత్యేక స్థానముంది. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. శంఖంలో దక్షిణావృత శంఖం, వామావృత శంఖం అని రెండు రకాలున్నాయి. దక్షిణావృత శంఖాన్ని పూజలో పెద్దగా వాడరు. ఇది తెలుపు రంగులో ఉంటుంది. దానిపై కాఫీ రంగు గీత ఉంటుంది. ఈ శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. వామా వృత శంఖం ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరి చేరవట.
