బమ్మెర పోతనామాత్యుడు రచించిన మహా భాగవతంలో శ్రీహరి దశావతారాల గురించి ప్రస్తావన ఉంది. అయితే దానిలో మోహినీ అవతారం ప్రసక్తే లేదు. భాగవతంలో ప్రత్యేకించి క్షీరసాగర మథనం ఘట్టం ఉంటుంది. దానిలో మోహిని అవతార ప్రసక్తి ఉంటుంది. స్వర్గాధిపత్యం కోసం దేవతలు, దానవులు యుద్ధం చేస్తున్న సమయమది. అయితే ఆ యుద్ధంలో దేవతల శక్తి క్షీణించసాగించిందట. అసురుల శక్తి మాత్రం విజృంభిస్తోందట. ఆ తరుణంలో దేవతలంతా వెళ్లి బ్రహ్మకు మొరపెట్టుకున్నారట. అప్పుడు బ్రహ్మ, శివుడు సకల దేవతలతో కలిసి వైకుంఠానికి వెళ్లారట.

పరమేశ్వరుడు సహా దేవతలంతా రావడాన్ని చూసిన నారాయణుడు.. దేవతలకు ఓ సూచన చేశాడట. రాక్షసులతో సఖ్యంగా ఉంటూ ఉంటూ వారితో కలిసి క్షీరసాగరాన్ని మథిస్తే అమృతం పుడుతుందని.. అది సేవిస్తే దేవతలంతా అమరులుగా మారి.. రాక్షసులు నశిస్తారని చెప్పాడట. దేవతలంతా కలిసి వెళ్లి దానవులతో మాట్లాడి.. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని.. వాసుకిని తాడుగా అల్లి.. క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారట. మంధర పర్వతం సముద్రంలో పడిపోడుకుండా శ్రీహరి కూర్మావతారం దాల్చి తన వీపుపై మందర పర్వతాన్ని మోశాడు. అలా ముందుగా హాలాహలం.. ఆ తరువాత అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవించారు.
