కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కుంభమేళా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పరిశీలించారు. 25 రోజులుగా యోగి కాస్త సమయం కల్పించుకుని మరీ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి స్వయంగా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌ హనుమాన్‌ మందిర్‌లో యోగి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంగం నోజ్‌ ఘాట్‌ దగ్గరకు చేరుకుని అక్కడ త్రివేణి సంగమం దగ్గర హారతి ఇచ్చారు. ఏర్పాట్లపై ఉన్నాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలోనే బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను యోగి ప్రారంభించారు. అలాగే 6 లేన్ల బ్రిడ్జ్‌ను సైతం ఆయన ప్రారంభించారు. కుంభమేళా 13వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. దీనికోసం దేశ విదేశాల నుంచి భక్తులు పుణ్య స్నానాల కోసం రానున్నారు. ఈ కుంభమేళాను యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని నిర్వహణ కోసం రూ.7500 కోట్లు కేటాయించింది. రైల్వే శాఖ, ఆర్టీసీ సైతం అప్రమత్తమయ్యాయి. అదనపు సర్వీసులను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు సైతం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఏఐ టెక్నాలజీతో వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై డేగకన్నుపెట్టారు.

Share this post with your friends