లోక కల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం జరిగిన 10వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
అయోధ్యకాండలోని 35 నుండి 39వ సర్గ వరకు మొత్తం ఐదు సర్గల్లో 164 శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 189 శ్లోకాలను పారాయణం చేశారు.
ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా.రామానుజాచార్యులు, శ్రీ అనంత, డా.మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ రాజేష్ బృందం “దేవతల గాచిన దేవుడితడు…. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రామ రామ శ్రీ రఘురామ……” అనే సంకీర్తనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.