హిందువుల ఇంట వివాహం ఎంత సంప్రదాయబద్దంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా అరుంధతి నక్షత్రం చూపించకుంటే వివాహం సంపూర్ణం కాదు. మరి ఎవరీ అరుంధతి? ఎందుకు వివాహం రోజున ఈ నక్షత్రాన్ని చూపిస్తారు? అంటే దీనికో కథ ఉంది. అరుంధతి దేవి మహా పతివ్రత. వశిష్ట మహర్షి భార్యే అరుంధతి. పెళ్లి అనంతరం అరుంధతిని, వశిష్ట నక్షత్రాన్ని చూపిస్తారు. బ్రహ్మ దేవుని కూతురైన సంధ్యా దేవి.. తనకు వశిష్ట మహర్షి ఉపదేశం చేసిన తర్వాత తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ అగ్నిలో నుంచి ప్రాతఃసంధ్య, సాయం సంధ్యలతో ఓ అందమైన స్త్రీ రూపం బయటకు వస్తుంది.. ఆ స్త్రీ రూపమే అరుంధతి.
అగ్నిలో నుంచి వచ్చిన ఆ అపురూప సౌందర్యాన్ని చూసిన వశిష్ట మహర్షి ఆకర్షణకు లోనై వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఇక వివాహ సమయం రానే వచ్చింది. వివాహ సమయంలో వశిష్టులవారు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తాను తాను ఎప్పుడైతే తిరిగొస్తానో అప్పటివరకు ఎదురుచూడాలని ఆదేశించి వెళతాడు. కానీ ఎంత కాలమైనా వశిష్టుడు తిరిగి రాడు. అరుంధతిని ఎందరో బుుషులు కావాలనుకున్నా ఆమె మాత్రం వారి వంక కూడా చూడదు. అప్పుడు వారే వశిష్టుడిని వెదికి తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెట్టగా అప్పుడు ఆమె తన చూపును వశిష్టుని వైపునకు తిప్పిందట. అప్పటి నుంచి అరుంధతిని మహా పతివ్రతగా కీర్తిస్తారు. తన దీక్షతో ఆకాశంలో నక్షత్రంగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదీ అరుంధతి కథ.